Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : Kabul: కాబూల్ ఆసుపత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడి.. 400 మంది మృతి! ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులు పెను విషాదాన్ని మిగిల్చాయి. సోమవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో మాదకద్రవ్యాల వ్యసనం నుంచి విముక్తి పొందేందుకు చికిత్స అందిస్తున్న 'ఒమిడ్ అడిక్షన్ ట్రీట్మెంట్ హాస్పిటల్' (Omid Addiction Treatment Hospital) లక్ష్యంగా పాక్ యుద్ధ విమానాలు క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ఈ భీకర దాడిలో ఇప్పటివరకు 400 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 250 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని తాలిబన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 2,000 పడకల సామర్థ్యం కలిగిన ఈ భారీ ఆసుపత్రి భవనం దాడుల ధాటికి కుప్పకూలింది. దాడి జరిగిన సమయంలో వందలాది మంది రోగులు నిద్రలో ఉండటంతో ప్రాణనష్టం భారీగా జరిగింది. మృతుల్లో ఎక్కువ మంది పేద రోగులు, ఆసుపత్రి సిబ్బంది ఉన్నట్లు సమాచారం. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని, శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు రెస్క్యూ టీమ్స్ శ్రమిస్తున్నాయని అధికారులు తెలిపారు. పౌర ఆసుపత్రిపై దాడి చేయడం అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని, ఇది మానవత్వానికి వ్యతిరేకమైన నేరమని తాలిబన్ ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రత్ మండిపడ్డారు. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే, తాము కేవలం ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని, పౌర ప్రాంతాలపై దాడులు చేయలేదని పాకిస్థాన్ ప్రభుత్వం బుకాయిస్తోంది. ఈ ఘటనతో ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఆసుపత్రి ధ్వంసమై వందలాది మంది అమాయకులు బలికావడంతో అంతర్జాతీయ సమాజం ఈ దాడులపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి.
Admin
Mana Mahati News