Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : తెలంగాణలో బంజారాలకు కాంగ్రెస్ అన్యాయం – ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆవేదన.... కాంగ్రెస్ పార్టీకి బంజారాల హెచ్చరిక.... తెలంగాణ రాష్ట్రంలో సుమారు 30 లక్షలకుపైగా జనాభా కలిగిన బంజారాలు రాష్ట్రంలో రాజకీయాలనూ తారు మారు చేసే చైతన్యం కలిగి ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో బంజారాలు ముఖ్యమైన పాత్ర పోషించారని స్వయంగా ముఖ్యమంత్రి శ్రీ ఏ.రేవంత్ రెడ్డి తెలియజేసిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అయినప్పటికీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) ఇటీవల ఏర్పాటు చేసిన కోఆర్డినేషన్ కమిటీలో బంజారాలకు చెందిన ఒక్క ప్రతినిధికి కూడా స్థానం కల్పించకపోవడం సమాజానికి తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. బంజారా సమాజం ఎప్పటినుంచో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తూ, పార్టీ విజయాల్లో కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపులో బంజారా ఓటర్లు, నాయకులు, కార్యకర్తలు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించారని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని సభలలో తెలియజేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి సమాజాన్ని పక్కన పెట్టడం అనేది కేవలం ఒక నిర్ణయం మాత్రమే కాదు, అది ఒక పెద్ద సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేయడం అని భావించవచ్చు. ఇది మాత్రమే కాకుండా, రాష్ట్రంలో మంత్రి పదవుల విషయంలో కూడా బంజారా జాతికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల సమాజం ఇప్పటికే ఆవేదనకు కారణమైంది. ఇప్పుడు AICC స్థాయిలో కూడా కోఆర్డినేషన్ కమిటీలో ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల బంజారా సమాజం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. ముఫై 30 లక్షల జనాభా కలిగిన బంజారా జాతికి రాజకీయంగా గుర్తింపు ఇవ్వకపోవడం, వారి కృషిని గౌరవించకపోవడం, సమాజంలో అసమానతలకు దారితీస్తున్నది. ఇది భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ప్రతికూల పరిస్థితులను తీసుకువస్తుంది. మేము ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున ఆవేదనను వ్యక్తం చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ విషయాన్ని అత్యంత ప్రాముఖ్యతతో పరిగణించి వెంటనే బంజారా జాతికి మంత్రి మండలి లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే, ఇటువంటి నిర్ణయాలు భవిష్యత్తులో రాజకీయ పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నాము. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం బంజారాల హక్కుల కోసం పోరాడటానికి ఎల్లవేళల సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాము. ఇట్లు, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు: మోహన్ సింగ్ ప్రధాన కార్యదర్శి: బస్కి నాయక్
Admin
Mana Mahati News